యేసు క్రీస్తు ప్రభుని చరిత్ర
దేవుడు యేసు క్రీస్తు అను పేరున శరీరధారిగా లోక రక్షణార్ధమై వచ్చునను వార్త సృష్ట్యాధిని పాప ప్రవేశ కాలము నుండి నాల్గు వేల సంవత్సరము వరకు దైవజ్ఞులకు తెలియుచు వచ్చెను. త్రికాల రక్షకుడైన యేసు ప్రభువు తర్వాత కన్యకా గర్భమున నిష్కళంక రూపిగా జన్మించెను. సత్ప్రవర్తనకు మాదిరి చూపించెను. ధర్మములు బోధించెను. అందరిని తన యొద్దకు వచ్చి శాంతి పొందుడని చెప్పెను. పాపులకు పాప పరిహారమును వినిపించెను. రోగులను మందులేకుండ బాగు చేసెను. భూత పీడితులకు విముక్తి కలిగించెను. తారసిల్లిన మృతులను బ్రతికించెను. గాలిని, నీటిని గద్దించి శిష్యులను మరణాపాయము నుండి తప్పించెను. బోధ వినవచ్చిన ఐదు వేల మంది కంటే ఎక్కువ మందికి అద్భుతాహారము కల్పించి తృప్తిపరచెను. శత్రువులను క్షమించెను. అందరితో కలిసిమెలసి యుండును. లోకము నిమిత్తమై ప్రాణ సమర్పణ చేయ వచ్చెను. గనుక విరోధులు చంపగా చంపనిచ్చెను. మూడవనాడు బ్రతికి వచ్చి కనబడెను. సైతానును, దయ్యములను, పాపములను, పాపఫలితములగు కష్టములను, వ్యాధులను, మరణమును గెలిచెను. తన విషయములు లోక మంతటికి తెలుపవలెనని తన శిష్యులకు ఆజ్ఞాపించి దేవలోకమునకు వెళ్ళెను.